Tuesday, September 25, 2012

అభివృద్ధితో ‘వైవిధ్యం’ హరీ!

ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల సంఖ్య పెరిగిపోవడం జీవ వైవిధ్యానికి పెనుఘాతంగానే మారుతోంది. భారత్ వంటి జీవ వైవిధ్య కాణాచివంటి ప్రాంతాల్లో సైతం ఈ పట్టణీకరణ అనేక జీవ, జంతుజాతులకు ఆవాసం లేకుండా చేయడమే కాకుండా అరుదైన వృక్షాలు కూడా అంతరించిపోవడానికి వాటి ఆనవాళ్లు సైతం లేకుండా పోవడానికి కారణమవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వౌలిక సదుపాయాల కల్పన ఏ దేశానికైనా అత్యవసరమే. అలాగని అరుదైన జీవ వైవిధ్యాన్ని పణంగాపెట్టి అర్థరహితంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించుకోవడం ఎంత మాత్రం పర్యావరణ సమతూకానికి దోహదం చేసేదికాదు. ఆసియా ప్రాంతంలోని చైనా, భారత్ సహా అనేక దేశాల్లో పట్టణీకరణ శరవేగంగా పెరిగిపోతోంది. అనేకచోట్ల తీరప్రాంత కారిడార్ల నిర్మాణం జోరుగా సాగడంతో అరుదైన సముద్ర జాతుల ఆవాసానికి ముప్పువాటిల్లుతోంది. పట్టణాల విస్తరణ వల్ల అనివార్యంగానే జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తోంది. దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల జీవ వైవిధ్య ఉనికికే ముప్పువాటిల్లే పరిస్థితి తెలెత్తుతోంది. అభివృద్ధి అవసరమే అయినా దాన్ని ఓ ప్రణాళికబద్ధంగా ఉపయోగించుకోవడం వల్ల మనిషి తన క్షేమాన్ని ప్రకృతి, ఇతర జీవ జాతుల సంక్షేమాన్ని పరిరక్షించుకున్నట్టు అవుతుంది. పర్యావరణ పరిరక్షణ విధానాల విషయంలో రెండో ఆలోచనకు తావుండకూడదు. మన ఉనికి అంతా ప్రకృతి చుట్టూ పరిభ్రమించేదే కావడం వల్ల, ఆ ప్రకృతి సమతూకం కొరవడితే ముప్పు తథ్యమన్న స్పృహను మనిషి కలిగి ఉండాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల అభివృద్ధి కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సుముద్ర జాతులు అలాగే ఈ భూగోళం మీద సంచరించే అరుదైన జీవ జాతులు అంతరించిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూగజీవాల ఆవాసాలు సైతం మనిషి కబ్జా చేస్తున్నాడు. ఫలితంగా అనేక జంతుజాతులు నిలువ నీడలేక అంతరించిపోతున్నాయి.
ఇప్పటికే 25 పక్షి జాతులు, 139 సముద్ర, భూ చరాలు, 41కి పైగా జంతుజాతులు ముప్పు ముంగిళ్ళలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా అభివృద్ధి పేరుతో అడవులు నిర్మూలించడం వల్ల కూడా అనేక రకాలుగా పర్యావరణ సమతూకానికి ముప్పు వాటిల్లుతోంది. అనేక విధాలుగా అరుదైన మూలికలకు, ఔషధాలకు నెలవులైన అడవులు అంతరించిపోవడం అన్నది వైద్యపరంగా కూడా మనిషి తన ఆరోగ్యకరమైన జీవనాన్ని అంతం చేసుకోవడమే అవుతుంది. అభివృద్ధిని కాదనలేం కానీ.. దాని పేరుతో ప్రకృతి సౌరభాన్ని ఇతర జీవ, జంతు జాతుల ఆవాసాన్ని హరించడం మాత్రం క్షమార్హం కాదు. ఇటువంటి కార్యకలాపాలకు, అనాలోచిత విధానాలకు స్వస్తిపలకనిదే జీవ వైవిధ్యం కొనసాగే అవకాశం లేదు. ఇప్పటికే అంతరించిపోయిన వృక్ష, జంతుజాతులను తిరిగి సృష్టించే అవకాశం లేదు. ఉన్నవాటినైనా పరిరక్షించుకోగలిగితే ఈ సృష్టి పుష్టిగా ఉంటుంది. ఇది అందరూ కళ్లు తెరవాల్సిన సమయం. అంతర్జాతీయంగా పర్యావరణ సదస్సులు ఎన్ని నిర్వహించినా, జీవ వైవిధ్య పరిరక్షణపై ఎన్ని ఒడంబడికలు కుదుర్చుకున్నా అవి ఆచరణ యోగ్యం కాకపోతే ఫలితం శూన్యం. జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించి ఇప్పుడు మాటల్లో కాదు చేతల్లోనే మనిషి తన నిజాయితీని నిరూపించుకోవాలి

No comments: