Monday, November 21, 2011

ప్లాస్టిక్ వ్యర్ధాలతో అనర్ధం

Source: andhrabhoomi
ప్రజలు నిత్య జీవితంలో ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వాడకంపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు మట్టిలో కలవాలంటే లక్ష సంవత్సరాలు పడుతుంది. పాల ప్యాకెట్ల నుండి కూరగాయల కోసం, భోజనం పార్సిళ్లకోసం, వేడి సాంబారు, పెరుగు, ఐస్‌క్రీం కప్పులు, ప్లాస్టిక్ ఇస్తల్రు, వాటర్ బాటిల్స్ మరియు ఇళ్లలో వాడుకొనే ప్లాస్టిక్ వస్తువులు వాడటంవల్ల పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి తగ్గిపోవడమేకాక స్లోపాయిజన్‌గా మారి క్యాన్సర్, కిడ్నీ, కాలేయం వ్యాధులుసోకి మనిషి బలహీనపడిపోతాడు. వీటిని ఒక చోట చెత్తగా చేర్చి కాల్చడంవల్ల ఆ పొగ ద్వారా విషవాయువు ఏర్పడి మన శరీరంలోకి ప్రవేశించి, అనేక రోగాలకు దారితీస్తుంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తిని నోరు లేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ సంచులు భూమిలో పొరలు పొరలుగా పేరుకుపోయి భూగర్భ జలాలకు ఆటంకం ఏర్పడుతుంది. వర్షపు నీరు సముద్రంలో కలిసిపోతుంది. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు నిరంతరం వాడుతుంటే రాబోయే కాలంలో ప్రకృతి ప్రసాదించిన ప్రాణాధారమైన మంచినీరు కనుమరుగైపోతుంది.
మురుగు కాల్వలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నిల్వ ఉండటంవల్ల దోమలు నివాసాలు ఏర్పరచుకొని అనేక రోగాలు వ్యాపిస్తాయ. 20 మైక్రాన్ల కంటె తక్కువ మందం ఉండే క్యారీ బ్యాగుల తయారీ వాడకం గతంలో ఉన్నత న్యాయస్థానం నిషేధించింది. 20/30 మీటర్ల సైజులో 50 సంచులు కలిపి 105 గ్రాముల బరువు మాత్రమే ఉండాలి. ఇవి తెలుపు, సాధారణ రంగుల్లోనే ఉండాలి. 20 మైక్రాన్ల కంటె తక్కువ మందంగల క్యారీ బ్యాగులు ఎక్కువ సంఖ్యలో తయారుచేస్తున్నారు. అవి అన్ని పట్టణాలలో, పల్లెటూర్లలో, చిల్లర దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలలో ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారు. వీటి గురించి ప్రభుత్వం గాని, ప్రభుత్వ పురపాలక సంఘ అధికారులు, ప్రజారోగ్యశాఖ వారు గాని అసలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఒక్కొక్క పట్టణంలో 807 టన్నుల చెత్త తయారవుతున్నది. ఇందులో 70 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 640కి పైగా ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకు 42 చొప్పున పెద్ద, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. శస్త్ర వైద్య సంబంధమైన వ్యర్థాలు, శరీర భాగాలు, శానిటరీ ప్యాడ్స్, విసర్జిత వ్యర్థాలు, శాప్స్, డ్రస్సింగ్ మ్యాట్, బ్యాండేజీలు, కలుషితపు రక్తంతో కలిసిన రోగ కారణమైన వస్తువులు, పాథలాజికల్, సర్జికల్ వ్యర్థ పదార్థాలు, మైక్రో బయాలజి, బయో టెక్నాలజీ వ్యర్థాలు, ప్లాస్టిక్ ట్యూబులు, సిరంజిలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వ్యాపారస్థులు వ్యాపారం దెబ్బతింటుందని పరిశ్రమల యజమానులకు నష్టాలు వస్తాయని ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధానికి ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు.
ఇదిలావుండగా అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రభుత్వం వారు ప్లాస్టిక్ తయారీ అమ్మకం, మరియు వాడకం నిబంధనలు 1999లో విడుదల చేశారు. దానికి అనుగుణంగా ప్లాస్టిక్ తయారీ వాడకం గురించి కొన్ని పరిమితులు, విధానాలు విధించారు. భారత ప్రభుత్వం రీసైక్లింగ్ చేయబడిన ప్లాస్టిక్ సంచులు మరియు డబ్బాల తయారీ, వాడకాన్ని నియంత్రించడం కోసం రీసైక్లిడ్ ప్లాస్టిక్ నిబంధనలు 1999ని పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ప్రకటించింది. ఈ నిబంధనలు 2.9.1999 నుండి అమలులోకి వచ్చాయ. ఇవి 2003 సంవత్సరంలో సవరించబడి ప్లాస్టిక్ అమ్మకాలు, తయారీ మరియు వాడుకగా పేర్కొనబడినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ సంచులు మరియు రీసెక్లిడ్డ్ ప్లాస్టిక్స్ గురించి అడవులు, పర్యావరణ శాస్త్ర మరియు సాంకేతిక శాఖవారు ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య ది.30.3.2001న ఉత్తర్వులు జారీచేసినా నేటికి అమలుకాలేదు. 20 మైక్రాన్ల కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ సంచులు తయారీ, రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి లేదా నిలిపివేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భవిష్యత్తు ప్రమాదాలను దృష్టిలో వుంచుకొని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలను నియంత్రించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.

No comments: